ఎట్టకేలకు శార్దూల్ ను తప్పించారు... కివీస్ పై టాస్ గెలిచిన టీమిండియా

  • వరల్డ్ కప్ లో నేడు కీలక సమరం
  • ధర్మశాలలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
  • శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీకి చోటు
  • గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు చోటు
గత వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం సెమీస్ లోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత్ ను ఓడించింది న్యూజిలాండ్ జట్టే. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ముందు ప్రతీకారం తీర్చుకునే అవకాశం నిలిచింది. టీమిండియా నేడు న్యూజిలాండ్ జట్టుతో తలపడుతోంది. ధర్మశాలలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. కాగా, టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడానికి కారణమేమీ లేదని భారత సారథి రోహిత్ శర్మ తెలిపాడు. 

ఇక, వరల్డ్ కప్ కోసం భారత్ ప్రతి మ్యాచ్ లోనూ శార్దూల్ ఠాకూర్ ను ఆడిస్తుండడం విమర్శల పాలవడం తెలిసిందే. ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో మహ్మద్ షమీని తుదిజట్టులోకి తీసుకున్నారు. గత మ్యాచ్ లో గాయపడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు చోటు కల్పించారు. 

అటు, న్యూజిలాండ్ జట్టులో మార్పులేమీ లేవు. వరల్డ్ కప్ లో ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ చెరో 4 మ్యాచ్ లు ఆడి ఓటమి లేకుండా కొనసాగుతున్నాయి. రెండు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉండడంతో ఇవాళ హోరాహోరీ తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సొంతగడ్డపై ఆడుతుండడం వల్ల టీమిండియాకే అవకాశాలు ఎక్కువని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.

Team India
Toss
New Zealand
Dharmashala
World Cup

More Telugu News